అందరికీ నమస్కారం!
విశాలాక్షి సాహిత్య మాసపత్రిక 13 ఏళ్లుగా ఎన్ని అవాంతరాలు ఎదురైనా, కష్టకాలంను కూడా అధిగమిస్తూ, ఒక ప్రవాహంలా తీసుకు వస్తున్నాం. సహజంగా దీని వెనుక మా ప్రకటన కర్తలు, వ్యాపార సంస్థలు, చందాదారులు అని చెబుతూ రావాలి. కానీ, మాకు అలాంటి అవసరం రాలేదు. అవకాశం కూడా లేదు. ఎందుకంటే ప్రకటనలు వేసింది లేదు.
నిజానికి 13 ఏళ్లుగా 4000 ప్రతులు పంపుతూ ఉంటే 50 మంది చందాదారులు కూడా ఈరోజుకు మాకు లేదని ఎలా చెప్పుకోవాలో ఒక దిక్కుతోచని పరిస్థితి మాది. అయినప్పటికీ కేవలం మా యజమాని, నిర్వాహకులు కోసూరు రత్నం గారు ఒక అకుంఠిత దీక్షతోనే ఈ పత్రికను తీసుకువస్తున్నారు.
అనేక నష్టాలను కష్టాలను చవిచూస్తున్నా, "ఏం కాదు... మనం చేయాల్సిన బాధ్యత మన చేద్దాం" అంటూనే ఆయన ముందుకు నడుస్తున్నారు.
తొలి ఏళ్లలో 'చందాలు కట్టండి' అని ప్రతినెల మా పత్రికలోని ప్రకటనలు ఇస్తూ వచ్చాము. అయినప్పటికీ ఏ ఒక్కరో ఇద్దరో తప్పించి మరే స్పందనా లేదు. అందుకనే ఆ ప్రకటన ఇవ్వటం కూడా మానేశాం.
కానీ, 'మా కవిత వేయండి' అనో, 'మా సమీక్ష వేయండి' అనో, లేదా 'మా కథ వేయండి' అనో అడిగే రచయితలు, ఎప్పుడన్నా వారివి వేయకపోతే వేయలేదనే నిష్ఠురాలు, ప్రశ్నలు వింటూనే ఉంటాం. అయినా దానికి మేము సంతోషిస్తున్నాం. ఎందుకంటే మా పత్రికలో రావాలని కోరిక వ్యక్తం చేయడం కూడా మాకు ఆనందంగానూ గర్వంగానూ ఉంటుంది.
అంతే సూటిగా చెప్పదలుచుకున్నది ఏమిటంటే 'పత్రికకు పాఠకులే మూల స్తంభాలుగా నిలబడాలని, నిలబడతారని' ఆశిస్తూ...
మీ
ఈతకోట సుబ్బారావు
సంపాదకుడు
Comments
Post a Comment