విశాలాక్షి అక్టోబర్ 2023 సంచిక ఈ రోజు చూడగలిగాను, శిఖా ఆకాష్ గారి వాట్శాప్ ద్వారా .. అప్పుడప్పుడూ వాట్శాప్ యూనివర్సిటీ కూడా కాస్త పనికొచ్చే పనులు కూడా చేస్తుందనిపించింది.
50 పేజీల్లోనే పత్రిక వైవిధ్య భరితంగా ఉంది. చక్కటి శీర్షికలున్నాయి. కవిత్వం మీద మీ ప్రత్యేక శ్రద్ధ బాగా కనిపిస్తోంది. పత్రిక ద్వారా చాలా మందిని మళ్ళీ కలిసినట్లైంది.
ప్రొ. గణేశ్వర రావు గారి కథా విశ్లేషణ శీర్షికలో ముకుంద రామారావు గారి కథను విశ్లేషించిన తీరు చెహోవ్ కథతో పోలిక బావుంది.
కవి మణిందర్ గారితో విల్సన్ రావు గారి ఇంటర్వ్యూ లో మాణిక్యాల రావు గారు తన గురువుగారు ఫ్రముఖ కవి కీ శే ఎండ్లూరి సుధాకర్ గారిని గుర్తుచేసుకోవడం సముచితం.
రామకవచం గారి కవితాస్త్రం లో ఆచార్య గోపీ గారి కవిత పరామర్శ శాస్త్ర బద్ధంగా ఉంది.
బాలాజీ గారి కవిత పసి పిల్లలతో ఆడుకోవడం లో ఉండే మనసు తేలికవడాన్నీ, ఆనందాన్నీ, త్రుప్తినీ, ఫలితంగా జీవనం లో కలిగే పునరుత్తేజాన్నీ రుచి చూపించింది.
గద్దర్ గారి మీద శిఖా ఆకాష్ కవిత, డా పద్మారావు గారి "వారే విజేతలు" కవితలో " వారు బహు ధ్వనులు బహుజనులు "అనే వ్యక్తీకరణ చాలా బావుంది.
నా కవిత "బంధాలు" ప్రచురించినందుకు సంపాదక వర్గానికీ, మీకూ నా ధన్యవాదాలు. ఆరు నెలల తరవాత తొలిసారి ప్రచురణ కోసం పంపించిన కవిత అది. మీకు నచ్చినందుకు ప్రచురణార్హమైనందుకు సంతోషం.
పత్రిక మొత్తం చూశాక పాత రోజుల్లో నెల్లూర్లో కోమల విలాస్ లో మొలగొలుకుల బియ్యంతో చేసిన వేడి వేడి అన్నంలో పచ్చి మిరప కాయల పచ్చడీ, కంది పప్పూ, నెయ్యి కలుపుకొని తిని గడ్డ పెరుగుతో భోజనం ముగించినట్టుగా ఉంది.
మీ అక్షర సేద్యం నిప్పో ఫేక్టరీ ఎదురుగా ఉండే నవలాకుల తోటలా కొనసాగించండి.
మీ సంపాదకుల వారు రత్నం గారు అహం గురించి మంచి కథే చెప్పేరు. ఖాజ మొహిద్దీన్ గారికి మీ నివాళి ఆర్ద్రంగా ఉంది. పత్రికను చక్కగా తీసుకు వస్తున్న మీ సంపాదక బ్రుందానికి శుభాభినందనలు.
శుభాకాంక్షలతో
డా విద్యాసాగర్ అంగలకుర్తి
విశ్రాంత ఐ యే ఎస్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం
హైదరాబాదు
20.10.2023
Comments
Post a Comment